మునుపటి నా మాట
‘జమిందారీతనం వల్ల వచ్చిన వల్లమాలిన బద్ధకం’ తనకుందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎన్నో సందర్భాల్లో అంటూ ఉండేవారు. పాట వ్రాసి ఇవ్వండి శాస్త్రి గారూ అని హడావుడి చేసే ఏ నిర్మాతా ఆయన చుట్టూ తిరగలేదు. ఆయన పాట కావాలనుకునేవారు ఆగేవారు. అది ఇన్స్టంట్ కాఫీ కాదాయె. అమృతం ధార. ఆగాల్సిందే. ‘ఎందుకే నీకింత తొందర?’ అని ఆయన తన తొలి సినిమాతోనే స్పష్టం చేయడంతో తరువాత ఏ నిర్మాత కూడా ఆయన్ని తొందర పెట్టలేదు. ఆగితే మంచి చిలక పలుకులు దక్కుతాయని వారికి తెలుసు. అలాగని శాస్త్రిగారు తన ధోరణిలో ఏదో రాసుకుంటూ పోలేదు. సినిమాలో సందర్భానికి సరిపోయేలా రాస్తూనే తన శైలిని మాత్రం త్యాగం చెయ్యలేదు. ఆయన తన చుట్టూ టేప్ రికార్డర్ పట్టుకు తిరిగేలా ఎవర్నీ శాశించలేదు. ఇక్కడో ముక్క అక్కడో ముక్క చెప్పి పాట అయిందనిపించే సవ్య సాచి కారు ఆయన. అయినా పాటలందు కృష్ణశాస్త్రి పాటలు వేరయా అని ఇటు నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో పాటు శ్రోతలకు కూడా తెలుసు. రికార్డులున్న రోజుల్లో ఎక్కడో దూరాన్నుంచి సినిమా పాట వినిపిస్తుంటే ‘కృ.శా. గారి పాటలాగుంది’ అని చెవులు తొందర పడేవి. నిజానికి ఆయన పాటకెటువంటి దృశ్యం అక్కర్లేదు. అదృశ్యంతోనే మనో చిత్రాన్ని దర్శించుకోవచ్చు. ఆ మనో చిత్రానికి న్యాయం కూర్చాలని ప్రతి స్వర కర్తా మడి కట్టుకుని మరీ స్వర పరిచేవారు. ఉదాహరణకి- చక్రవర్తి సంగీతంలో కొన్ని వేల పాటలు వచ్చి ఉండవచ్చు. ఆయనదో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉండి ఉండవచ్చు. అన్ని వేలపాటల్లో కొన్నిటిని వేళ్ళమీద లెక్కించాల్సి వస్తే అందులో రెండు వేళ్ళ మీద వెంటనే వచ్చి వాలే పాటలు కృష్ణశాస్త్రి రచనలే. అవి- చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు, కుశలమా నీకు కుశలమేనా ...అన్నవే. రెండు పాటలూ యుగళ గీతాలే. ఆ రెండు కూడా బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడినవే. చీకటి వెలుగులు పాట శ్రావ్య రాగమాలిక. అది చక్రవర్తి గారిని ఉన్నత శిఖరాన కూర్చోబెట్టింది. కుశలమా – పాట ఎంత ఆధునికమో అంత శ్రావ్యమైనది కూడా. మరొకరు సత్యం. వీరు ఎప్పటినుంచో చిత్రసీమలో ఉన్నా, ఎన్ని పాటలకో హిందీ బాణీలు ప్రేరణగా తీసుకున్నా శాస్త్రిగారి పాటలు తన చేతిలో పడేసరికి తన స్వంత బాణీలోని సత్తా చూపించుకున్నారు. ఎదుటనుంచి కదలను పదములింక వదలను, నేటికి మళ్ళీ మా ఇంట్లో ఎంచక్కా పండుగ, దూరాకాశ వీదుల్లో తారా దీపాలు, రామా ఓ రామా రావా కనరావా - ఈ పాటలన్నీ ఆయన చక్కగా చెక్కిన స్వర శిల్ప రూపాలు.
0 Comments
‘అవునా నిజమేనా?’ రేపటి రేయి పున్నమి రేయేనా? ‘రేయైతే వెన్నెల బయలంత’ నిండేనా? అయితే ‘పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే?’ అసలు ‘ప్రతి రాత్రి పున్నమి’ కాగలిగితే ఎంత బావుణ్ణు! ఆ పాన్పుపైన పరుండి నా స్వామిని చూడాలి. నా చందమామను చూడాలి. ‘అనుకోనా ఇది నిజమనుకోనా?’ ‘చందమామ ఈ కనులకు విందేనా?’ ‘ఎందుకు ఆ చందమామ? ఎవరి విందుకోసమో?’అని ‘ఎవరు ఏమని’ గుసగుసలాడినా... ‘ఔరా! కోరికలు,కలలు తీరా నిజమైతే?’ ‘జాబిలి కూన’ ‘ఎదుటనుంచి కదలను’... ‘గగన సీమల తేలు ఓ మేఘమాలా’, ‘కాస్త ఆగు’.. ‘ఆగు ..రవంత ఆగు’....‘ఆకాశపు అంచుల విహరించే చందమామ.. అవును..ఆ ‘చందమామ పైని ఏ మబ్బులు ముసరరాదని’ ... ‘మరి మరి విన్నానులే’. అటువంటి ‘తరగని తగ్గని జాబిలి’ వస్తుంటే ‘వాకిటిలో నిలబడకు’ ఏదో..‘మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం!’ ‘అవునే.. తానే..నన్నేనే...నిజమేనే’ చూడ వస్తున్నాడు. ‘ఒరిగింది చంద్రవంక...ఒయ్యారి తార వంక’ అనో, ‘నెలవంక పక్క ఈ తళుకు తార మెరవాలి’ అనో అక్కడెక్కడో ‘ద్వారానికి తారామణి హారం..హారతి వెన్నెల కర్పూరం’ అమరిన చోట అనుకుంటే విన్నాను. కాని ఇప్పుడో.. ‘అందేనా ఈ చేతుల కందేనా? పోనీ ‘నింగి పైకి ఆశలనే నిచ్చెన’ వేస్తేనో? అమ్మో.. అది నా వల్లనయ్యే పనేనా? అయినా ‘మాటలాడగానే సరా? మనసులో నిజం పలకాలి’ ఫాల్గుణ కృష్ణపక్షం అంటే కూడ సద్గుణ కృష్ణ(శాస్త్రీయ) పక్షమే! 1 Nov 1897 - 24 Feb 1980 ఒక వారం ఆగమన్నాను. తీరా చూస్తే ఓ పక్షం రోజులు గడిచినట్టున్నాయి. మీరు గానీ ఆశతో ఎదురు చూసేరో ఏమో? కృష్ణశాస్త్రి గారి పాటలు మరిన్ని వినాలనే ఉత్సుకత మీలో ఉందో ఏమో? నా దురాశ కాదు కానీ, ఈ ఫాల్గుణ మాసమంతా ఆయన ధ్యాసలోనే మిమ్మల్నీ గడిపేయమన్నాను. ఈ శిశిరం ఇలా వెళ్లిపోనీండి, ఎంచక్కా వసంతం వచ్చేస్తుంది. 'ఖర' నామ సంవత్సరం కొరకొర చూస్తోంది, ఎందుకంటే ‘నందన’ ఉగాది ఇంకెంతసేపు నా రాక అన్నట్టు ఉవ్వీళ్ళూరుతుంటేనూ! ఫాల్గుణ కృష్ణ పక్షంలో తొలి విడత మీరు చూసిన దృశ్య గానాలు ఇవీ : కనులు చూసినా పాటే- రెండు కనులూ తెరిస్తే చాలు నాలుగు వీడియోలు కృ.శా గారి శైలిని అద్భుతంగా అభినయించిన నటీనటుల్ని ఎదుట ఉంచాయి అని మీరూ అంటారు. సాహిత్య సంగీతాలతో పాటు నటన ఏకం అయ్యేలా చూడగలగడం దర్శకుడి బాధ్యత. అందులోనూ- కృ.శా పాట అనగానే అంతర్దర్శనం ఎరిగి ఉండాలి. మొదటిది- ‘ఇది మల్లెల వేళ యనీ’ పాట ( చిత్రం: సుఖదు:ఖాలు- శివరంజనీ, మిశ్ర పీలూ ఛాయల్లో కోదండపాణి అమోఘంగా సృష్టించి, సుశీలమ్మ చేత ఎంత ఆర్ద్రంగా పాడించారూ! పాట దృశ్యం అలా అలా చూసేయక దర్శకుడు తీసుకున్న శ్రద్ధని కాస్త గమనించారు కదూ. ఆలాపన నుంచి ముక్తాయింపు వరకు ఎంత సమయం పట్టిందీ, పాట సన్నివేశంలో గోడ గడియారం ఏం చూపుతోంది అనేది గ్రహించారు కదూ). కృష్ణశాస్త్రి గారి ఈ పాట - ఆనాడూ అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ పాట శాస్త్రిగారు రాసి ఇచ్చిన తరువాతే స్వర కర్త కోదండపాణి ట్యూన్ కట్టారు. ఆ రికార్డింగ్ లో శాస్త్రి గారు దగ్గరుండి చాలా తృప్తి చెందారని దాసరి వారు చెప్పారు. కొంతమంది మాత్రం ఆ పాట రికార్డింగ్ కోసం వెళ్ళే లోపల ‘ఇది మల్లెల మాసమనీ, ఇది వెన్నెల వేళ యనీ’ అని ఉండేది కాస్త అటూ ఇటూ అయి పోయిందని లేనిపోనివి సృష్టించి చెప్పారు. అదే గనుక నిజమైతే ప్రత్యక్ష సాక్షి దేవులపల్లి ఊరుకునే వారా? ‘మేఘమాల’ పాటల పుస్తకంలోనూ దిద్దుబాటు ఉండేదే! అందరూ అనుకునేది ఆ పాట పల్లవిలో వసంత ఋతువూ, కార్తీక మాసం కలగలిసి పోయాయి అనే. ఆ చిత్రంలో నాయికది అర్ధాంతరంగా ముగిసి పోయే పాత్ర. ఆమె గాయని. అలా బ్రతుకు ముగిసిపోక ముందే ఆమె రేడియో కోసం పాడే పాట అది. ఆమె బేలతనం ఇంకొకరి తొందరపాటు తనానికి బలి కావడం ఒక భవిష్యత్ దర్శనం. కోయిలకి మావి చిగురులే తప్ప మల్లెల తోనూ, వెన్నెల తోనూ సంబంధమే లేదు. వెన్నెల ఏ మాసం లోనైనా రాత్రి వేళే వస్తుంది. ‘కార్తీక మాసంలో కరి మబ్బు ఉండదు’ కనుక ఆ మాసం లోని వెన్నెల మరింత తేజస్సుతో అగుపిస్తుంది. కోయిలకి మల్లెలూ, వెన్నెలా వసంతంలో అవసరమయ్యాయంటే అదంతా ‘ఆపోజిట్ జెండర్’ ఆకర్షణ వల్ల. ఈ ఆకర్షణే తొందరపాటుకి దారి తీసింది. ‘ఏ వసంత కోకిలా వాన వేళ పాడదు’ అని ఒక కవి సెలవిచ్చారు. అది నిజం కాదు. నిజమేనేమో అప్పుడింక మావి చిగురులుండవు కదా అనవచ్చు కొందరు. ఇంతకీ కోయిల కూసేది ఎందుకనీ? గజి’బిజీ’ ప్రపంచంలో కాకి గోల మధ్యన కాస్త ఊరట కలిగించే పంచమ స్వరం కోయిల కూత కనుక (ఇప్పటి కొత్త కవికి 'మాఘ మాస వేళ కోయిలమ్మ పాట' గురించి అనుభవముంది. ఎవరూ పల్లెత్తు మాట అనకూడదు). రెండవది - ‘కొంచెం కొంచెం బిడియాలు’ పాట ( చిత్రం: విజయం మనదే- మాటల్లో చెప్పలేని అన్న అనుబంధాన్ని సింధు భైరవి రాగంలో ఘంటసాల గారు స్వర పరిచి స్వయంగా పాడితే ఆర్ద్రత రాకుండా ఉంటుందా? పైగా – రచన కృ.శా. గారిదాయే! మూడవది- మనసూగే తనువూగే (భాగ్య రేఖ- హిందీ పాట ‘మన్ డోలే మేరా తన్ డోలే’ వరసలో సాగినా హిందీ పాటలో ఉండే నాగస్వరం (బీన్ మ్యూజిక్ ) లేని తెలుగు పాట ఇది. అడుగడుగునా కృ.శా వేసే పదజాలం ఒక ఆకర్షణ (హిందీ పాటను హేమంత్ కుమార్ స్వర పరిస్తే, బీన్ మ్యూజిక్ ఇద్దరు మేధావుల సమష్టి కృషి. వారు- కల్యాణ్ జీ, రవి. కల్యాణ్ జీ వీర్ జీ షా దివంగతులై కొన్నేళ్ళయ్యింది. ఈ మార్చి 7 న రవి శంకర్ శర్మ, బొంబాయి రవి అనబడు రవి మరణించారు. రవి హిందీ లోనే కాక మలయాళంలోనూ ఎన్నో చిత్రాలకి బాణీలు అందించారు. తెలుగులోనూ ఒక సినిమా ఉన్నట్టు గుర్తు. నాగిన్ రికార్డ్ కవర్ ప్రతి ముఖమూ ప్రసిద్ధమేలో సిద్ధం). నాలుగవది- ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ (ఏకవీర- మహదేవన్ ఇంటర్ల్యూడ్స్ మాత్రమే ఇచ్చిన ఈ పాట ఒరిజినల్ కంపోజర్ బి.గోపాలం గారు. కాంతారావు గారికిబాలు గళం చక్కగా అమరుతుందని కోదండపాణి ‘ఉక్కుపిడుగు’ చిత్రం లో ‘ఏ వూరు ఎవరు మీ వారు’ పాట ఇచ్చి నిరూపించారు. ఘంటసాల, బాలుల మేలు గళ కలయిక లో ఇది రెండవ పాట, తొలి పాటంత హిట్ కావడం దీని విశేషం. ముఖ్యంగా స్టేజి మీద ఇద్దరు గాయకులు పాడవలసివస్తే ఇవి వరాలు). (All the four videos are archived under 'devulapalli' in kanulu choosinaa paate). సినిమా సన్నివేశంలో ఈ పాటకి ముందు సంభాషణా రచయిత డాక్టర్ సినారెపాట పల్లవిలోని మాటలే పాత్రల చేత పలికించారు. స్క్రీన్ ప్లీ లో అటువంటి జాగర్తలు ఎన్నో తీసుకునీ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసిద్ధ నవలని సినిమా కథగా మలిస్తే అది సామాన్య జనాన్ని అంతగా ఆకర్షించలేక పోయింది. అయితే అందరూ హర్షించినదేమిటంటే మేటి కవులిద్దరూ తమ తమ బాణీల బాణాలు ఎవరికి వారే సాటి అన్నట్టు అద్భుతంగా సంధించారు అన్నదే. ఇక్కడో చమత్కారం చెప్పుకోవాలి. ఘంటసాల, బాలుల కాంబినేషన్ లో వచ్చిన తొలిపాట ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ (మంచిమిత్రులు) సి.నా.రె. వారి రచన అయితే రెండవపాట ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ కృ.శా వారి రచన కావడం విశేషం. తొలి పాట లో ‘ఉదయం’, రెండవ పాటలో ‘రాత్రి’ రావడం చూస్తే కవి ‘సమయాలు’ అంటే ఇవేనేమో అనిపిస్తాయి. కనులు మూసినా పాటే- అష్ట దిక్కులు మార్మోగేలా ఓ ఎనిమిది కృ.శా మెలోడీలు చెవిని తాకాయి కదా. అన్నీ అరుదైనవే. సాలెగూటిని జల్లెడ పట్టి గాలించి చూసినా దొరకని పాటలవి. ముఖ్యంగా మాటలాడలేని కృ.శా వారికిష్టమైన ‘మాట’ ప్రసక్తి తీసుకొచ్చిన మూడు పాటలు ఉన్నాయే - సత్యం, రమేష్ నాయుడు, రాజేశ్వరరావు గార్లు ఒక్కొక్కరు వాటిని ఎంత వైవిధ్యంగా స్వర పరచారో గమనించే ఉంటారు. ఫాల్గుణ శుక్ల పక్షం అంతా సద్గుణ కృష్ణ (శాస్త్రి) పక్షమే! 1 Nov 1897 - 24 Feb 1980 చూస్తే ఇది ఫాల్గుణ మాసం. ఈ శుక్ల పక్షం అంతా కృష్ణ (శాస్త్రి) పక్ష పాతిని నేను. ఫాల్గుణ మాసం గుణం ఏమిటంటే ‘ఫాల్’, అదే ఆకులు రాల్చడం. అంటే శిశిర ఋతువు అన్న మాట. మరి కృష్ణ శాస్త్రి గారేమన్నారూ- ‘శీతవేళ రానీయకు రానీయకు, శిశిరానికి చోటీయకు చోటీయకు’ అనేగా? ఆయన మాత్రం అవి రెండూ చూసుకునీ శాశ్వతంగా వెళ్ళిపోయారు. పైగా ‘రానిక నీకోసం సఖీ, రాదిక వసంత మాసం’ అని అర్ధాంగి చెవిలో ఊది ‘దూరాకాశ వీధుల్లో తారా దీపాల’ మధ్య ‘దూరాన ధ్రువతారను చేరే తీరాలని’ సెలవు తీసుకునీ వెళ్లారు. మనం ఆయన లేరని నమ్మం – ఎందుకంటే తన పాటల ఖజానాలో దాచి ఉంచిన విలువైన మాటల బట్టీ – అంటే ‘వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం’ – అన్న పంక్తిలోని మాటల బట్టీ ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ అనే ఆశాభావంతో మనం ఉంటాం కాబట్టి, ‘బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగ సాగాలి’ అన్న ఆయన ఆశాజ్యోతిని మనం చేజిక్కించుకున్నాం కాబట్టి. అయినా కృష్ణశాస్త్రి గారు ముందే ఎందుకన్నారూ , 'దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అని? 'అవని అంతా నా అక్షయ పాత్ర' అన్నదీ వారే. అటువంటిది ఈ భువిని వదిలి ఎలా వెళ్ళ గలిగారో? బహుశా మళ్ళీ మనకోసం పాటలు రాయనని చెప్పడానికి 'దివినుండి దిగి రాను' అని సరదాగా మనల్ని గిచ్చారేమో. బహుశా తన పాటల భూమియే మనకో అక్షయ పాత్ర అయినప్పుడు ఇంక తన అవసరమేముందని అలా సెలవిచ్చారేమో? కృష్ణశాస్త్రి గారంటే ఫలానా అని పాత తరానికి ఇంకా గుర్తు చెయ్యడం అంటూ ఉంటే ‘అయ్యో ఒకనాటి తెలుగు వాడా’ అని ఆక్రోశించాల్సిందే. ఆయన పద్మభూషణుడు, మహాకవి, మాట పోక ముందు గొప్ప వక్త, గాయకుడు, గాలిలో దీపం లా ప్రస్తుతం ఉన్న రేడియోకి ఒకనాడు రేడియం ఆయనే అన్నది ఇప్పటి తరం ఇచ్చే సూక్ష్మం లో మోక్ష పరిచయం. ‘మల్లీశ్వరి’ ని పిలిచి ‘ఉండమ్మా బొట్టు పెడతా’ అంటే సంతోషించని తెలుగు వారుండరు. మల్లీశ్వరి అంతలాగ మాట్లాడిందంటే అదంతా కృష్ణ శాస్త్రి చేసిన ‘వాక్’ దానమే. అందుకే ఆయన ‘మళ్ళీ ఈసారి’ అని ఎవరు అడిగినా ‘సరే కానివ్వండి’ అని తల ఊపక ఏ సినిమాకీ మాటలు రాయక పాటలతోనే సరిపెట్టుకున్నారు. మల్లీశ్వరి, ఉండమ్మా బొట్టు పెడతా, శ్రీరామ పట్టాభిషేకం – సినిమాలకి మాత్రం మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు. ఆకలి, తండ్రి, రాజగురువు, అఖండుడు, ఆడజన్మ, జగత్ కిలాడీలు, జగత్ జెట్టీలు, వాడే వీడు, రాముడే దేవుడు, ధనవంతులు – గుణవంతులు, జీవితాశయం వంటి సినిమా పేర్లు గుర్తున్నాయంటే అందుక్కారణం -ఒకటీ అరా దేవులపల్లి వారి పాటలే వాటిలో ఉండడం. దేవులపల్లి వారు వేలాది పాటలు రాయలేదు. బి.ఎన్. రెడ్డి గారు వందల కొద్దీ సినిమాలు తీయలేదు. అయితేనేం- ఇద్దరూ పద్మభూషణులే. ‘భూషణం’ అంటేనే అంత- మితంలో అమితం. (స్వగతం: మనల్ని నిత్యం కూర్చునీ పొగిడేవారికన్నా అడపా దడపా నిలబడి నియంత్రించేవారే అసలైన ఆప్తులు, ఆత్మీయులూనూ. మహాకవులకి సైతం అటువంటి మహానుభావులంటేనే ఇష్టం). ఒకనాటి ‘విజయ చిత్ర’ తో సమానంగా ‘సినిమా రంగం’ అనే మాస పత్రిక ఉండేది. , దరిమిలా ఆ పత్రికే ‘ఫిల్మాలయ’ గా మారింది. ఆ పత్రిక సంపాదకులు, ప్రముఖ పాత్రికేయులు జి.వి.జి కృష్ణశాస్త్రి గారితో చేసిన ఇంటర్ వ్యూ ని సెప్టెంబర్ 1975 సంచికలో ప్రచురించేరు. అందులో కృ.శా ఒకానొక మహానుభావుని గురించి స్నేహపూర్వకంగా చెప్పిన (రాసిన) మాటలు ‘తిరుగులేని మాట’ లుగా చదవండి. |
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|